Sunday, May 19, 2019

'ఆత్మీయ‘బంధన్‌' frm eenADu Sunday

Frm eenADu Sunday
ఆత్మీయ'బంధన్‌'

వ్యక్తికీ సమాజానికీ... అవసరానికీ ఆలోచనకీ... ఆర్థిక సంస్థకీ పేదలకీ... మధ్య బంధం ఎలా ఉండాలో చెప్పే సంస్థ- బంధన్‌. పల్లెల్లో మహిళలకు రుణాలిచ్చే చిన్న సంస్థగా పుట్టి, బ్యాంకుగా దేశమంతటా విస్తరించడానికి రెండు దశాబ్దాలు కూడా పట్టలేదంటే దానికి కారణం - చంద్రశేఖర్‌ ఘోష్‌. పేద కుటుంబం నుంచీ బంధన్‌ బ్యాంక్‌ సీఈవో వరకూ ఆయన ప్రస్థానం స్వయంకృషికి సజీవ సాక్ష్యం.

సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఓ రోజు... 
'నేను ఉద్యోగం మానేస్తున్నా...' ఓ రాత్రి భార్యకి చెప్పేశాడు చంద్రశేఖర్‌. 'నలభై  ఏళ్లొస్తున్నాయి. ఇప్పుడీ జోకులేంటీ' నవ్వింది ఆమె. కానీ ఆయన ముఖం చూస్తే జోకులాగా అన్పించలేదు. ఒకింత గుబులుగా భర్త కళ్లలోకి చూసింది. 'నిజంగానే...  వ్యాపారం చేస్తా...' అన్నాడు నిబ్బరంగా. 'ఏం మాట్లాడుతున్నారో మీకర్థమవుతోందా? కుటుంబబాధ్యతలన్నీ మీమీదఉన్నప్పుడు ఉద్యోగం మానేసి ప్రయోగాలు చేస్తానంటారేమిటి?' అంటూనే ఆమెకు దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆయన ఎంత నచ్చజెప్పినా రాత్రంతా ఆమె ఏడుస్తూనే ఉంది. ముందూవెనకా ఎలాంటి ఆస్తులూ లేని కుటుంబానికి ఆయన జీతమే ఆధారం. దాన్ని పొదుపుగా వాడుతూ పొద్దున్న లేస్తే ఇంటిల్లిపాది అవసరాలన్నీ చూడాల్సింది ఆమే మరి. ఇంకా అతని తమ్ముళ్లూ చెల్లెళ్ల బాధ్యతలు తీరనేలేదు. అత్తగారి బాగోగులూ పెద్దవాడవుతున్న కొడుకు చదువూ... ఇవన్నీ ఎలా అన్నదే ఆమె ఆందోళన. చంద్రశేఖర్‌ మాత్రం నిర్ణయం మార్చుకోలేదు. భార్య అంతగా బాధపడుతున్నా నెలకు ఐదువేలు వస్తున్న ఉద్యోగం మానేయాలని అతడు ఎందుకనుకున్నాడంటే...

కష్టాలు తెలుసు కానీ... 
ఓరోజు ఉదయమే కూరలు తేవడానికి కచ్చాబజార్‌ మార్కెట్‌కి వెళ్లాడు చంద్రశేఖర్‌. అక్కడ స్కూటర్‌ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు బళ్లమీద కూరగాయలూ పండ్లూ అమ్ముతున్న చిరువ్యాపారులకు ఐదేసి వందలు ఇచ్చి వారి దగ్గరనుంచి ఐదు రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్లు వెళ్లిపోయాక అక్కడివారిని అడిగాడాయన. వాళ్లెందుకు డబ్బు పంచిపెట్టారని. 'డబ్బు పంచిపెట్టలేదు నాయనా. ఐదు రూపాయల వడ్డీకి అప్పు ఇచ్చారు. వడ్డీ ముందే తీసుకున్నారు. సాయంత్రం వచ్చి అసలు వసూలుచేసుకెళ్తారు. కూరలు కొనుక్కొచ్చి ఇక్కడ అమ్మడానికి మా దగ్గర ఐదువందల రూపాయలు ఎక్కడుంటాయి. అందుకే వడ్డీకి తీసుకుంటాం' అని వివరంగా చెప్పిందో అవ్వ. గణాంక శాస్త్రం చదివిన ఆయన బుర్ర ఆమె చెప్పినదాన్ని అరక్షణంలో విశ్లేషించింది. ఒక పూటకి ఐదువందలకు ఐదు రూపాయలు అంటే 700 శాతం వడ్డీ అన్నమాట. ఆ విషయమే వారికి చెబితే- 'ఆ లెక్కలు మాకు తెలియవు. వ్యాపారానికి డబ్బు కావాలి. ఎలాంటి ష్యూరిటీలూ అడక్కుండా మా దగ్గరికి వచ్చి మరీ వాళ్లు డబ్బిస్తున్నప్పుడు కష్టమో నష్టమో ఐదురూపాయలు వడ్డీ కట్టక తప్పేదేముంది' అన్న వారి సమాధానం అతనిలో ఆలోచన రేకెత్తించింది. రోజంతా కష్టపడి పనిచేస్తున్న వాళ్లకి అంత వడ్డీ పోగా మిగిలేది పదో పరకో. వడ్డీ వ్యాపారి మాత్రం కూర్చున్న చోటి నుంచి కదలకుండా రోజూ వందల్లో సంపాదిస్తున్నాడు. ఎంత దారుణమిది... అనుకున్న చంద్రశేఖర్‌ అక్కడున్న వాళ్లందరితో మాట్లాడాడు. పల్లెల్లో అయినా, పట్టణాల్లో అయినా పేదల పరిస్థితి ఒకటే అని అర్థమైంది. పూటగడవడమే కష్టమైన వారికి ఆస్తిపాస్తులుండడమన్నది కలలోని మాటే. హామీ పెట్టడానికి ఆస్తులేమీ లేనివారికి బ్యాంకులు రుణాలు ఇవ్వవు. మరో దారి లేక వాళ్లు వడ్డీవ్యాపారుల మీద ఆధారపడుతున్నారు. సంపాదనలో వడ్డీ పోగా మిగిలినదాంతో పిల్లలకు తిండి పెట్టడమే గొప్ప. ఇంక చదువులెక్కడ? అందుకే ఎన్నాళ్లు కష్టపడినా వాళ్ల బతుకులు అలాగే ఉంటున్నాయి. సమస్యకి మూలం ఎక్కడుందో అర్థమైన చంద్రశేఖర్‌కి కర్తవ్యం తెలిసివచ్చింది. పేదవారికి సౌకర్యంగా ఉండే పద్ధతిలో తక్కువ వడ్డీతో అప్పు ఇస్తే తప్ప వారి పరిస్థితి మారదనీ పిల్లలు చదువుకోలేరనీ అర్థం కాగానే ఆ పని తానే చేయాలని నిర్ణయించుకున్నాడు. చంద్రశేఖర్‌ ఆ నిర్ణయానికి రావడానికి కారణం ఆయన బాల్యమే.


 

నిరుపేద కుటుంబం 
త్రిపురలోని నరౌర గ్రామంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఆరుగురు సంతానంలో పెద్దవాడిగా పుట్టాడు చంద్రశేఖర్‌. తండ్రి నడిపే మిఠాయి దుకాణమే ఆ కుటుంబానికి ఆధారం. చిన్నారి చంద్రశేఖర్‌ రోజూ బడికి వెళ్లడానికి ముందూ, బడినుంచి వచ్చాకా దుకాణంలో తండ్రికి సాయం చేసేవాడు.  చదువుకుంటేనే ఎక్కడైనా బతకవచ్చని చెప్పే తండ్రిమాటను అర్థంచేసుకున్న చంద్రశేఖర్‌ ఎన్ని పనులు చేస్తున్నా చదువు కొనసాగించాడు. పట్టణానికి వెళ్లి పై చదువులు చదివే స్థోమత లేక బంధువుల సాయంతో ఢాకాలోని రామకృష్ణ మఠంలో ఆశ్రయం పొంది కాలేజీలో చేరాడు. చదువుకుంటూనే ట్యూషన్లు చెబుతూ తన ఖర్చులకు తానే సంపాదించుకునేవాడు. స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీ చేస్తుండగానే తండ్రి క్యాన్సర్‌తో మరణించాడు. దాంతో కుటుంబ బాధ్యత చంద్రశేఖర్‌ మీద పడింది. అక్కడే ఓ ఎన్జీవోలో ఉద్యోగంలో చేరాడు. తరచూ తుపానులు వచ్చే ఆ ప్రాంతం పేదరికానికి పర్యాయపదంలా ఉండేది. అక్కడి పల్లెల్లోని ప్రజలను సంఘటిత పరిచి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు సంస్థ తరఫున సహాయం అందించడం చంద్రశేఖర్‌ బాధ్యత. అది తన మనస్తత్వానికి దగ్గరగా ఉండటంతో అందులో మమేకమై పనిచేసేవాడు చంద్రశేఖర్‌. కొన్నేళ్లు అక్కడ పనిచేశాక స్వదేశానికి తిరిగివచ్చి పెళ్లి చేసుకుని కోల్‌కతాలో స్థిరపడినా మరో ఎన్జీవోలోనే ఉద్యోగంలో చేరాడు. విధినిర్వహణలో భాగంగా పల్లెల్లో పర్యటిస్తూ ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో చైతన్యం తెచ్చే బాధ్యత పైనే దృష్టిపెట్టిన చంద్రశేఖర్‌లో సొంతంగా తానే ఏమన్నా చేయాలన్న ఆలోచన మొదలైంది మాత్రం కూరగాయల మార్కెట్లో వడ్డీల విషయం ప్రత్యక్షంగా చూశాకే. దానికి తోడు ఏళ్ల తరబడి పల్లెల్లో తిరిగిన అనుభవం మహిళలకు చేయూతనిస్తే మొత్తం కుటుంబం గాడినపడుతుందన్న నమ్మకాన్ని ఇచ్చింది. అందుకే చిరువ్యాపారాలకు తక్కువ వడ్డీకి అప్పులిచ్చే సంస్థను పెడితే తాము బతుకుతూ మరికొంతమందికి మేలు చేయవచ్చని భార్య నీలిమకు నచ్చజెప్పి రంగంలోకి దిగాడు.

వడ్డీకి తెచ్చి మరీ... 
బ్యాంకు లోను తీసుకుని ఆ డబ్బుని తక్కువ వడ్డీకి అప్పులిచ్చి పేదలకు ఆర్థికభారం తగ్గించాలన్నది అతడి ప్లాను. ముందుగా పెట్టదలచుకున్న సంస్థకు సంబంధించిన విధివిధానాలన్నీ స్వయంగా రాసుకున్నాడు. 
మహిళలకే, వారి ఇంటి వద్దకే వెళ్లి అప్పు ఇవ్వాలి. వారు దానితో వ్యాపారమో, చేతివృత్తులో చేసుకుని డబ్బు సంపాదించుకోవాలి. అప్పు తీసుకునేవాళ్లంతా కచ్చితంగా సంతకం చేయడం నేర్చుకోవాలి. ప్రతి ఊళ్లోనూ బడి పెట్టాలి... ఇలాంటి ఆశయాలన్నీ గుదిగుచ్చి పక్కా ప్రణాళికని సిద్ధం చేసుకుని ఒక ఎన్జీవోను ఏర్పాటుచేశాడు. ఆ తర్వాత లోను కోసం బ్యాంకుకు వెళ్తే అధికారులు అతడికి రుణం ఇవ్వలేదు. అందుకు వారు చెప్పిన కారణాలు- అతడు సమాజంలో పేరున్న వ్యక్తి కాదు, అతడి ఎన్జీవోకి లాభాలు సంపాదించిన అనుభవం లేదు,  మూడేళ్ళపాటు వరసగా లాభాలు సంపాదిస్తే తప్ప ఎన్జీవోకి లోను ఇచ్చే ప్రశ్నే లేదు అని. దాంతో బావమరిది దగ్గరా మరికొందరు బంధువుల దగ్గరా అప్పు చేసి మొత్తం రెండు లక్షల రూపాయలతో, ముగ్గురు ఉద్యోగులతో బగ్నాన్‌ అనే గ్రామంలో 'బంధన్‌'కి శ్రీకారం చుట్టాడు చంద్రశేఖర్‌. నెల తిరిగేసరికే ఆ డబ్బు అయిపోయింది. కానీ పేదల దగ్గర మాట నిలుపుకోడానికి ఏ వడ్డీవ్యాపారుల పద్ధతినైతే తాను వ్యతిరేకిస్తున్నాడో వారి దగ్గరకే వెళ్లి వడ్డీకి తెచ్చి మరీ అప్పులు ఇచ్చాడు. అది కొనసాగిస్తూనే పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తే ఏడాదిన్నర తర్వాత తొలి బ్యాంకు రుణం లభించింది. ఆ తర్వాత సంస్థ అభివృద్ధే బ్యాంకుల్ని పిలిచి రుణాలిచ్చేలా 
చేసింది.

ఒకరిని చూసి మరొకరు... 
ఇరవై ఏళ్ల సునీత ఉండేది కోల్‌కతాకి దూరంగా ఒక మారుమూల పల్లెలో. రెక్కలు ముక్కలు చేసుకుంటున్న అమ్మానాన్నలకు సాయపడటానికి ఆమెకి బంధన్‌ దారిచూపించింది. ఇప్పుడామె నేసే సంప్రదాయ శాలువాలకి మంచి పేరు. దిల్లీలోని మురికివాడలో ఉంటున్న షహనాజ్‌ బంధన్‌ దగ్గర అప్పుతీసుకుని మిషన్‌ కొనుక్కుంది. సూట్లు కుడుతూ మరో నలుగురికి ఉద్యోగమూ ఇచ్చింది. గౌహతికి చెందిన సంజయ్‌ ఇల్లు గడపడానికి కట్టెలనుంచీ కూరగాయల వరకూ ఏవేవో అమ్మాడు. బంధన్‌ గురించి తెలిసి రుణం తీసుకుని సొంతంగా దుకాణం పెట్టుకున్నాడు. స్థిరమైన ఆదాయంతో పిల్లల్ని చదివించుకుంటున్నాడు. ఇలా చెబుతూ పోతే బంధన్‌తో పెనవేసుకున్న బంధాలు లక్షలు! ఆర్థికంగా నిలదొక్కుకున్న కుటుంబాలన్నీ పిల్లల్ని చదివించడం చూస్తే చంద్రశేఖర్‌కి తన ఆశయం నెరవేరుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది జీవితాలను ప్రభావితం చేయడానికి అతడు పడ్డ కష్టం ఇంతా అంతా కాదు. ఇంటికొచ్చి డబ్బు ఇస్తానంటున్న చంద్రశేఖర్‌ని మొదట కొంచెం వింతగానే చూశారు గ్రామస్థులు. అయితే వడ్డీవ్యాపారులకు భిన్నంగా ఉన్న అతడి ప్రవర్తన వారిని కట్టిపడేసింది. సైకిల్‌ మీద తిరుగుతూ ఆడవాళ్లందరినీ ఒకచోట కూర్చోబెట్టి సూక్ష్మరుణాల గురించీ చిన్నమొత్తాల పొదుపు గురించీ వివరించి చెప్పేవాడు. తొలివిడతగా- నెలకు రెండు వేల లోపు ఆదాయం ఉన్న పాతిక మంది  మహిళలను ఎంచుకుని వాళ్లకు తలా వెయ్యి రూపాయలు అప్పుగా ఇచ్చాడు. పెట్టుబడికి డబ్బు లభించడంతో ఆ చిరు వ్యాపారులు ఎక్కువ వ్యాపారం చేసి వారం తిరిగేసరికి రెట్టింపు సంపాదించగలిగారు. చెల్లించాల్సిన వడ్డీ కూడా నామమాత్రమే కావడంతో మొట్టమొదటిసారి వాళ్లు చేతిలో మిగులు డబ్బు చూసుకోగలిగారు. అది చూసి మెల్ల మెల్లగా గ్రామంలోని మహిళలందరూ బృందాలుగా మారి అప్పు తీసుకోవడం మొదలెట్టారు. అలా మొదలైంది బంధన్‌ ప్రస్థానం... ఒక వీధి నుంచి మరో వీధికి, ఒక పల్లె నుంచి మరో పల్లెకి, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి. ప్రారంభించి పదేళ్లు కాకముందే 22 రాష్ట్రాలకు విస్తరించి దాదాపు 60 లక్షల మంది సభ్యులతో నూరుశాతం తిరిగి చెల్లింపుల రికార్డుతో దేశంలోనే అతి పెద్ద మైక్రోఫైనాన్స్‌ సంస్థగా ఉన్న బంధన్‌ ఆర్‌బీఐ నియమాలను అనుసరించి ఎన్జీవో నుంచి నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీగా మారింది. అయితే ఈ ప్రస్థానంలో తన వెనక ఉన్న క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర మరువలేనిదంటాడు చంద్రశేఖర్‌.

ఒక్కరు మిగిలారు! 
తొలిదశలో సిబ్బంది నియామకం విషయంలో అతడికెదురైన అనుభవం మరో వినూత్న ప్రయోగానికి తెరతీసింది. చంద్రశేఖర్‌ ఇచ్చిన పత్రికాప్రకటన చూసి పదిమంది దరఖాస్తు చేయగా ఇంటర్వ్యూకి ఐదుగురే వచ్చారట. వారికి ఉద్యోగంలో చేయాల్సిన పనుల గురించి చెప్పగానే ముగ్గురు తిరిగి వెళ్లిపోయారట. ఇద్దరు అప్పాయింట్మెంట్‌ లెటర్లు తీసుకోగా మర్నాడు ఒక్కరే ఉద్యోగంలో చేరారని చెబుతాడు చంద్రశేఖర్‌. పల్లెలకు వెళ్లి పనిచేయడాన్ని నామోషీగా భావించే యూనివర్శిటీ గ్రాడ్యుయేట్లతో లాభం లేదనుకున్న చంద్రశేఖర్‌ స్వయంగా గ్రామాలకు వెళ్లి అక్కడ హైస్కూలు, ఇంటర్మీడియట్‌ చదువుతున్న పిల్లల్ని ఎంపిక చేసుకుని శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. అది మూడువిధాలుగా ప్రయోజనకరంగా మారింది. తనకి కావలసిన రీతిలో శిక్షణ ఇచ్చి స్థానిక భాషలో మాట్లాడగల సమర్థులైన సిబ్బందిని చంద్రశేఖర్‌ తయారుచేసుకోగలిగితే, స్థానికంగానే మంచి ఉద్యోగం చేసుకునే అవకాశం యువతకు లభించింది. తమ ఊరి కుర్రాళ్లే లావాదేవీలన్నీ నిర్వహిస్తుండటంతో గ్రామస్థుల్లో నమ్మకం పెరిగింది. అలా తన సైన్యాన్ని కూడా స్వయంగా తయారుచేసుకున్నాడు చంద్రశేఖర్‌. బంధన్‌ సిబ్బంది ఇతర సంస్థల ఉద్యోగుల్లా తమ పని తాము చూసుకుని వెళ్లిపోరు. వినియోగదారులదీ తమదీ ఒకే కుటుంబం అన్నట్లుగా కలిసిపోతారు. 'మాది ఆర్థిక బంధం కాదు హార్థిక బంధం. అందుకే బ్యాంకుకు అంత విశ్వసనీయత వచ్చింద'ంటాడు చంద్రశేఖర్‌. బంధన్‌ని సూక్ష్మరుణ సంస్థ నుంచీ బ్యాంకుగా మార్చేటప్పుడు కూడా ఉన్న సిబ్బందికే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి బ్యాంకు ఉద్యోగులకు దీటుగా తయారుచేసుకున్నాడు చంద్రశేఖర్‌. పదివేలకోట్లు డిపాజిట్లుగా సేకరించడానికి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుందని తాను అంచనా వేస్తే 16 నెలల్లోనే 21వేల కోట్లు డిపాజిట్లు వచ్చాయనీ అదంతా తన సిబ్బందివల్లేననీ అంటాడాయన.

సవాళ్లను సమర్థంగా... 
చంద్రశేఖర్‌ ఒంటిచేత్తో ప్రారంభించిన ఈ సంస్థ ఒక గ్రామం నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ విస్తరించే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లకూ లెక్కలేదు. అయినా నిబ్బరంగా నిలబడటానికి కారణం మొదటినుంచీ చంద్రశేఖర్‌ అమలుచేస్తూ వచ్చిన క్రమశిక్షణే. 'బంధన్‌'లో ఏదైనా రూలంటే రూలే. ఒక్క రూపాయి కూడా లెక్కలోకి రాకుండా పోదు. ఎక్కడా ఒక్క పైసా వృథా కాదు. కార్యాలయాల్లో వినియోగదారులను ఆత్మీయంగా పలకరించే సిబ్బందే కన్పిస్తారు కానీ ఆడంబరాలు కన్పించవు. ఒకదశలో దేశంలోని సూక్ష్మరుణ సంస్థలన్నీ దివాలా తీశాయి. బతికి బట్టకట్టిన సంస్థలు ఆ కష్టాల్లోంచి గట్టెక్కడానికి వడ్డీరేట్లను విపరీతంగా పెంచేశాయి. బంధన్‌ ఒక్కటే ఏ మార్పూ లేకుండా స్థిరంగా నిలబడగలిగింది. ఆర్థికభారాన్ని స్వయంగా భరించిందే కానీ వినియోగదారుల మీద వేయలేదు. 'రిస్క్‌ 
తీసుకోవడం అనేది బాల్యం నుంచీ నాకు అలవాటుగా మారిపోయింది. అందుకే దేన్నైనా నేను రిస్క్‌గా చూడను, మరో కొత్త అవకాశంగా చూస్తాను' అనే చంద్రశేఖర్‌ మొన్నమొన్నటిదాకా పగలంతా సైకిల్‌ మీద పల్లెల్లో తిరుగుతూ పనిచేసేవాడు. రాత్రిపూట సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించేవాడు. ఇప్పుడు ల్యాండ్‌రోవర్‌ కారులో వెళ్తున్నా మారింది అతని వాహనం మాత్రమే, అతను కాదు... అందుకు సాక్ష్యమే దినదిన ప్రవర్థమానమవుతున్న 'బంధన్‌'

       *         *          *

'బంధన్‌' ప్రస్థానంలో రెండు సందర్భాల్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటాడు చంద్రశేఖర్‌. ఉద్యోగం మానేస్తానన్నప్పుడు భార్య ఏడవటమూ, ఆ తర్వాత అప్పు తీసుకునేవారు పెరిగినప్పుడు డబ్బుకోసం ఇబ్బందిపడటమూ. తన మీద తనకున్న నమ్మకంతో మొదటి సందర్భాన్ని గెలిచాననీ రెండో సందర్భంలో నిరాశా నిస్పృహలు దిక్కుతోచకుండా చేసినా రేపటి మీద ఆశ దాన్ని జయించేలా చేసిందనీ చెప్పే చంద్రశేఖర్‌ తనలో ఆ రెండు లక్షణాలే లేకపోతే ఈపాటికి ఒక మామూలు ఉద్యోగిగా రిటైరయ్యేవాడినంటాడు నవ్వుతూ. 


'బంధన్‌' ప్రత్యేకతలివి! 

స్వాతంత్య్రం వచ్చాక తూర్పు భారతావనిలో ఏర్పాటైన తొలి బ్యాంకు బంధన్‌. 2001లో ప్రారంభమైన 'బంధన్‌' దేశంలో అతి పెద్ద సూక్ష్మరుణ సంస్థ. 
2014లో బ్యాంకు లైసెన్సుకి దరఖాస్తు చేసేనాటికి 40వేల మంది సిబ్బందితో 25శాతం మార్కెట్‌షేర్‌తో ఉన్న బంధన్‌ 2015లో పూర్తిస్థాయి బ్యాంకుగా మారింది. 
*  రుణం ఇవ్వడమూ వసూలుచేయడమూ మాత్రమే కాదు, రుణగ్రహీతల వ్యాపారాలనూ క్షేత్రస్థాయి సిబ్బంది గమనిస్తూనే ఉంటారు. ఎక్కడైనా వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిస్తే అవసరమైన సహాయం అందిస్తారు. 
అందుకే ఒకసారి బంధన్‌లో చేరినవారెవరైనా శాశ్వతసభ్యులుగా ఉండిపోతారు. 
*నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం విస్తరిస్తున్న బంధన్‌ గత ఏడాది పబ్లిక్‌ ఇష్యూకి వచ్చి ఒక్కసారిగా వ్యాపార ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాది హౌసింగ్‌ రుణాల రంగంలో పేరున్న గృహ్‌ ఫైనాన్స్‌ను విలీనం చేసుకుని 
మరింతగా బలపడింది 'బంధన్‌'. గత ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్‌ పరిశ్రమ పలు సవాళ్లను ఎదుర్కొనగా బంధన్‌ మాత్రం వృద్ధిపరంగా ముందు వరసలో నిలిచింది.

No comments:

Post a Comment

Security status not satisfied.

I was planning to say hello, but now I think greetings are unnecessary. Firstly, I already know you and all your loved ones very well. ...