Tuesday, May 7, 2019

రైతు ప్రయోజనాలతోనా రాజీ?

ప్రయోజనాలతోనా రాజీ?

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటే, అక్షరాలా ఇదే. దాదాపు పన్నెండు లక్షల 50వేల కోట్ల రూపాయల విలువైన బహుళ జాతి దిగ్గజం పెప్సికో- గుజరాత్‌కు చెందిన తొమ్మిదిమంది రైతులపై న్యాయ పోరాటానికి సమకట్టడం, నష్టపరిహారం కోరడం జన సామాన్యాన్ని నివ్వెరపరచేదే. దేశీయ చిరుతిళ్ల మార్కెట్లో విరివిగా విక్రయమవుతున్న 'లేస్‌' చిప్స్‌ పొట్లాలను పెప్సికోయే ఉత్పత్తి చేస్తోంది. ఆ చిప్స్‌ తయారీకి అనువైన బంగాళ దుంపల వంగడం (వాణిజ్య నామధేయం ఎఫ్‌సీ-5)పై 2001నాటి చట్టం కింద పెప్సికో 2031దాకా పేటెంట్‌ పొందింది. 12వేల మంది రైతులతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా ఆ ప్రత్యేక వంగడం విత్తనాన్ని వారికే విక్రయించి, మేలిమి బంగాళదుంపల్ని వారినుంచి తిరిగి కొనుగోలు చెయ్యడం ద్వారా తన బ్రాండును సుస్థిరం చేసుకొన్న పెప్సికో సంస్థకు- అదే వంగడం బంగాళదుంపల్ని మరికొందరు రైతులు పండిస్తుండటం మహాపరాధంగా, తన మేధో సంబంధ హక్కుల్ని కొల్లగొట్టడంగా తోచింది. గూఢచారుల్ని నియమించి, వాళ్లతో కొనుగోలుదారుల అవతారం ఎత్తించి సచిత్ర సాక్ష్యాధారాలతో నెలరోజులనాడు కోర్టులో కేసు వేసింది. పెప్సికో కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయంటూ అహ్మదాబాద్‌ నగర వాణిజ్య కోర్టు- ఆ రకం వంగడాన్ని రైతులు పండించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. నలుగురు రైతులపై తలా కోటి రూపాయలకుపైగా నష్టపరిహారం కోరుతూ వేసిన కేసు వెలుగులోకొచ్చి బడుగు కర్షకులకు బాసటగా పార్టీలూ రైతు సంఘాలు మోహరించడంతో, పెప్సికో నోట కోర్టు వెలుపల రాజీ మాట వెలువడింది. గుజరాత్‌ ప్రభుత్వంతో సుదీర్ఘ చర్చల దరిమిలా కేసు ఉపసంహరణకు సిద్ధమైన పెప్సికో- తమకు పేటెంట్‌గల వంగడాన్ని ఆయా రైతులు పండించరాదని, ఒకవేళ పండిస్తే విధిగా తమకే  విక్రయించాలనడం దేశవ్యాప్తంగా కర్షక సంఘాల్ని, 'రైతే రాజు' కావాలని పరితపించే ఆలోచనాపరుల్ని ఒక్కతీరుగా కుపితుల్ని చేస్తోంది. రైతు ప్రయోజనాలతో ఈ తరహా 'రాజీ' ఏమాత్రం క్షంతవ్యం కానిది!

No comments:

Post a Comment

Pending for payment.

Greetings!<br> Have you seen lately my e-mail to you from an account of yours?<br> Yeah, that merely confirms that I have gain...